UPDATED 30th JUNE 2026 10:10 PM
29 మంది అధికారులపై తుది విచారణకు ప్రభుత్వం ఆదేశం!
విచారణాధికారిగా రాజమహేంద్రవరం మున్సిపల్ ఆర్డీ నాగనరసింహారావు నియామకం
పీవోగా రాజమహేంద్రవరం రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్వీ భాస్కరరావు బాధ్యతలు
3 నెలల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 30 : కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్రతో పాటు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు చెందిన మొత్తం 29 మంది అధికారులపై శాఖాపరమైన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ జీవోలను (జీవో నెం 805, 806) జారీ చేశారు. గతంలో అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వంటి తీవ్ర అక్రమాలు వెలుగుచూశాయి. ఏసీబీ సిఫార్సుల మేరకు రంగంలోకి దిగిన ప్రభుత్వం, ఈ వ్యవహారంపై విచారణాధికారిగా రాజమహేంద్రవరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ నాగ నరసింహారావును నియమించింది. నిందితులపై ఉన్న ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి, మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని స్పష్టమైన గడువు విధించింది. మరోవైపు ఈ విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గానూ, ఈ కేసుకు 'ప్రెజెంటింగ్ ఆఫీసర్'గా రాజమహేంద్రవరం రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్వీ భాస్కరరావును ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ప్రెజెంటింగ్ ఆఫీసర్ నిందితుల వివరాలను, చార్జ్ షీట్లను విచారణాధికారికి సమర్పించనున్నారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ప్రస్తుతం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.







