UPDATED 13th AUGUST 2026 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్), ఆగష్టు 13: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో పచ్చకామెర్లు (జాండీస్) తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత పది రోజులుగా గ్రామంలో చిన్నారులు వరుసగా అస్వస్థతకు గురవుతుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 3వ తేదీన నలుగురు పిల్లల్లో పచ్చకామెర్ల లక్షణాలు బయటపడగా, తాజాగా మరో ఐదుగురు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9కి చేరింది. సమాచారం అందుకున్న వెంటనే వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రాథమికంగా పచ్చకామెర్లుగా నిర్ధారించారు.
బాధితుల్లో ముగ్గురు చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, మిగిలిన ఐదుగురు స్వగృహాల్లోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఎంపీడీవో కె. సూర్యనారాయణ వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో డిప్యూటీ డీఎంహెచ్వో పర్యటన
పరిస్థితి తీవ్రతను దృష్ట్యా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంతి కట్టమూరు గ్రామాన్ని సందర్శించారు. బాధిత చిన్నారుల కుటుంబాలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం గ్రామంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ క్యాంపును పరిశీలించి, వైద్య బృందాలకు తగిన మార్గదర్శకాలు జారీ చేశారు.
బాధితులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి, ప్రతీ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
తాగునీరు కలుషితమే కారణమా?
గ్రామంలో తాగునీటి సరఫరా వ్యవస్థలో పరిశుభ్రత లోపించడం, నీరు కలుషితం కావడం వల్లే తమ పిల్లలు వ్యాధిబారిన పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, తాగునీటి నమూనాలను (Water Samples) సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ నీటిని బాగా కాచి, చల్లార్చిన తర్వాతే తాగాలని వైద్యాధికారులు సూచించారు.







