Updated 29 January 2022 Saturday 09:00 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. లోక్సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు పార్టీ ఎంపీలు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన వినతులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించనున్నారు. అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని కేసీఆర్ సూచించనున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయసభలలో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో హోరెత్తించారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే వైఖరిని అవలంబించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 31 సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు.. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి.