UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 09:00 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిష్టర్ కేటీ రామారావు త్వరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 125 అడుగుల పొడవున్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇందిరా నగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA)కి చెందిన స్థలంలో ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
HMDAకు చెందిన స్థలాలను వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతోనే పేదలకు సాయం చేసే దిశగా ఫంక్షన్ హాల్ ను కట్టించి పేదలకు సాయపడాలనుకుంటున్నాం’ అని మంత్రి అన్నారు.
ఇందిరా నగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీను గురువారం ప్రారంభించారు కేటీఆర్. జీహెచ్ఎంసీ వెయ్యి 785లక్షలు వెచ్చించి నాలుగు బ్లాకుల్లో దీనిని నిర్మించారు. రెండు బెడ్ రూంల స్కీంలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించింది జీహెచ్ఎంసీ.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మొహమూద్ అలీ, మేయర్ జీ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమ్ నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ లతో పాటు ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.