అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: తెదేపా అధినేత చంద్రబాబు అజెండానే భాజపా నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. స్ట్రిప్ట్ మాత్రం తెదేపా కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు. అమరావతిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మాట్లాడారు. తెదేపా, భాజపాలకు సొంత అజెండా ఉండటం లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో భాజపా నేతలు అన్నారు. ఇప్పుడే ఆ పార్టీ నేతలే అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని భాజపా వాళ్లే అంటారు.. ఈ విషయంలో వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారనీ వాళ్లే ప్రశ్నిస్తారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు’’ అని సజ్జల ఎద్దేవా చేశారు.