UPDATED 21 JANUARY 2022 FRIDAY 09:00 PM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : నకిలీ, భారత వ్యతిరేక కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 35 యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసింది. రెండు వెబ్ సైట్లు, రెండు ఇన్స్టాగ్రామ్, రెండు ట్విటర్ ఖాతాలు. ఓ ఫేస్ బుక్ అకౌంట్ పైనా కొరడా ఝులిపించింది. వాటిని వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ వెల్లడించింది. సంబంధిత శాఖ జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల అకౌంట్లు, వెబ్ సైట్లను పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ యూట్యూబ్ ఛానెళ్లకు మొత్తం 1.20 కోట్ల మంది సబ్ సైబర్లు ఉన్నారని, వీటిలో అప్లోడ్ చేసిన వీడియోలకు 130 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయని తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భారత సాయుద దళాలు, జమ్మూ-కశ్మీర్, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం తదితర సున్నిత అంశాలపై అవి విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నాయని సహాయ్ వెల్లడించారు. గత నెలలోనూ పాకిస్థాన్ కు చెందిన 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్ సైట్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారి పై ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరిస్తామని సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ రాకూర్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ కూడా ముందుకొచ్చి అటువంటి ఛానెళ్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.