UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 07:00 PM
హిందూపురం (రెడ్ బీ న్యూస్): ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. మాట తప్పం మడమ తిప్పం అన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని మండిపడ్డారు. మాట తప్పం మడం తిప్పం.. అనే మాట.. ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు బాలకృష్ణ. ఉద్యోగుల ఆందోళనలనపైనా బాలయ్య స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రివర్స్ పీఆర్సీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు బాలకృష్ణ. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్దిలో 80ఏళ్లు వెనక్కి వెళ్లిందని వాపోయారు.
తప్పకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసుకొనేంత వరకు ఎవ్వరు నిద్రపోకూడదని బాలకృష్ణ అన్నారు. హిందూపురం ప్రజల చిరకాల కలను నెరవేర్చే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదామన్నారు. హిందూపురం జిల్లా సాధనకై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాల్సిందేనని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మౌన దీక్ష చేశారు. తమ డిమాండ్ను నెరవేర్చుకునే పోరాటంలో భాగంగా అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
హిందూపురంలో బాలకృష్ణ చేపట్టిన మౌన దీక్ష ముగిసింది. ఇది అంతం కాదు ఆరంభం అన్న బాలయ్య.. హిందూపురం జిల్లాను సాధించే వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. హిందూపురం జిల్లా కేంద్రం సాధన కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని మరోసారి ప్రకటించారు బాలయ్య. ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
రాత్రికి రాత్రే కొత్త జిల్లాల ప్రకటన చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు జగన్. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక అంశాల ఆధారంగానే సత్యసాయి జిల్లా, దాని కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఆధ్యాత్మికత ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ధర్నాలు చేయబోరని భావిస్తోందని ఆయన విమర్శించారు.
అయితే, తనకంటే అధికంగా ఆధ్యాత్మిక చింతన ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు బాలయ్య. నేను అఖండ అని, అన్ స్టాపబుల్ గా పోరాడతానని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తేనే ఆధ్యాత్మికంగానూ అన్ని విధాలుగా సరిపోతుందని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బాలయ్య తేల్చి చెప్పారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బాలయ్య అన్నారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే ధర్నా చేస్తామని, ఎవడొచ్చి ఆపుతాడో చూస్తానని అన్నారు. ఉద్యోగుల ఆందోళన నుంచి దృష్టిని మళ్లించేందుకే కొత్త జిల్లాల ప్రకటన చేశారని బాలకృష్ణ ఆరోపించారు.