దుర్గి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: టీడీపీ వ్యవస్థపాకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి గ్రామానికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. సమాచారమందుకున్న దుర్గి ఎస్.ఐ పాల్ రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు. విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.