UPDATED 10th JULY 2018 TUESDAY 10:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. మండల పరిధిలోని వేట్లపాలెం గ్రామంలో మాజీ జెడ్పీటీసి సభ్యుడు బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సుబ్బారావు నాయుడు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మార్పును, జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతూ అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని, పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీరాఘవులు, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల శ్రీను, సేపేని సురేష్, మాకిరెడ్డి రామం, అడబాల నాని, గోలి బాబ్జి, కోశాధికారి శెట్టిబత్తుల దుర్గ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.