అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని ధ్వజమెత్తారు. 15 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బీసీ మూతపడటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని మండిపడ్డారు. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్ఎస్బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలన్న ఆయన.. విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని కోరారు.