UPDATED 22nd APRIL 2022 FRIDAY 10:50 AM
Andhra pradesh: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ మట్టి మాఫియా దారుణానికి తెగబడింది.. రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా మట్టిని తరలించేందుకు కొందరు యత్నించగా సమాచారం అందుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అరవింద్ ఘటన స్థలంకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మాఫియాదారులు ఆర్ఐను అడ్డుకోవటమే కాకుండా దాడికి దిగారు.
అయినా ఆర్ఐ వెనక్కు తగ్గకుండా జేసీబీ పనులు నిలిపివేయాలని సూచించడంతో జేసీబీతో పక్కకు నెట్టివేశారు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి ఇసుక మాఫియా దారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే జరిగిన ఘటనపై ఆర్ఐ మాట్లాడుతూ.. తనకందిన సమాచారం మేరకు అక్రమ మట్టి రవాణాను అడ్డుకొనేందుకు ఇద్దరు సిబ్బందితో తాను వెళ్లానని, పనులు జరుగుతుంటే ఆపాలని సూచించానని అన్నారు. దీంతో పలువురు తనపై దాడికి దిగారని, జేసీబీపీ పనులను అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో జేసీబీతో నెట్టివేసే ప్రయత్నం చేశారని ఆర్ఐ తెలిపారు.
ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఐపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఆర్ఐపై దాడి ఘటన పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాురు. అరవింద్పై దాడి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పనేనని, జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ నిఅరెస్ట్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
మంత్రి పదవి పోయిన క్యాసినో స్టార్ విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నా.. ఇలా తన మాఫియా గ్యాంగులని అడ్డుకునే రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్త జాగ్రత్తగా వుండండి, సీఎం ప్రోత్సాహంతోనే మట్టిమాఫియాలు, గడ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని అన్నారు.మరోవైపు మోటూరు గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు.
ఇదంతా వైసీపీ నేతల పనేనంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవస్థలను నాశనం చేసేలా అధికారులపై వైసీపీ నేతలు దాడులు అమానుషం అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. త నెల రోజులుగా నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసిన, స్పందన కరువేనని, ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులు హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవెన్యూ అధికారి పై హత్యాయత్నం చేసిన వైసిపి తలపై 307 కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆర్ ఐ పై దాడికి దిగిన నిందితులను అదుపులోకి తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.