UPDATED 5th MARCH 2022 SATURDAY 08:15 AM
Minister Srinivas Goud : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏకంగా మంత్రి హత్యకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. తెలంగాణ కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్పై జరిగిన హత్య కుట్రను పోలీసులు చేధించిన సంగతి తెలిసిందే. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితుల కస్టడీ పిటిషన్పై నేడు మేడ్చల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపారు. కేసు విచారణ కోసం హైదరాబాద్ రావాలని పీఏ జితేందర్ రాజ్ను కోరారు.
ఈ కేసులో నాలుగు రోజుల క్రితం సౌత్ అవెన్యూ 105 నుంచి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి.. తెంలంగాణ పోలీసులకు ఢిల్లీ పోలీసులు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. తమ నాయకుడు నివాసం నుంచి నలుగురు కిడ్నాప్ గురైనట్లు ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు చేశారు.దీంతో అనుమానిత వ్యక్తులు కిడ్నాప్కు పాల్పడ్డారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన కేసు సంబంధించి నలుగురిని తామే అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. అయితే నిబంధనలు పాటించకుండా.. అధికారిక సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడంపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.