◆ హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తీసుకున్న చర్యలు, తదితర అంశాలపై డీజీపీ మహేందర్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనపై 907 కేసులు నమోదు చేసినట్లు ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ తెలిపారు. సమయానికి మించి వేడుకలు నిర్వహించినందుకు 263, పబ్లిక్లో న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని డీజీపీ తెలిపారు. గత నెల 24 నుంచి ఈనెల 2 వరకు 16,430 మందికి జరిమానా విధించామన్నారు. జూన్ 20 నుంచి డిసెంబర్ 23 వరకు 5,10,837 మందికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈనెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడం లేదని.. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వివరించారు. మరోవైపు కోర్టులు, విద్యాసంస్థలను ఆన్లైన్లో నిర్వహించాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 7కి వాయిదా వేసింది.