Updated 13th April 2017 Thursday 2:29PM
పెద్దాపురం: పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన బఱ్ఱె శ్రీనివాస్ మృతి కి సంబందించిన కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మృతుడిది హత్య, ప్రమాదమా, లేదా మరేదైనా కారణమా అనే అనుమానంతో పోలీసులు భిన్నకోణాలలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 12 న కాకినాడ బంధువుల ఇంట వివాహ వేడుకకు హాజరై తిరిగి తన స్వగ్రామం తాటిపర్తి కి మోటార్ వాహనం పై వస్తుండగా గోరింట శివారు ప్రాంతం లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. అయితే శ్రీనివాస్ ను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని మృతుడి తాలూకు బంధువులు ఆరోపించడం పై పోలీసులు ఆ దిశ గా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విషయం పై మృతుడిది హత్యా లేక ప్రమాదమా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గురువారం ఉదయం క్లూస్ టీమ్ ని రంగంలోకి దింపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని జాగిలాలతో క్షుణ్ణం గా తనిఖీ చేశారు. అయితే సమీపంలోని చెరుకుతోటలోకి జాగిలాలు వెళ్లి ఆగిపోవడంతో ఆ దిశ గా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హతునికి తల వెనుక భాగం లో బలమైన గాయాలు ఉండడం తో మృతి పట్ల పలు అనుమానాలు ప్రజలలో రేకెత్తుతున్నాయి. దర్యాప్తులో భాగంగా డిఎస్పీ ఎస్. రాజశేఖరావు ఆదేశాల మేరకు సి ఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ ఐ వై. సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రి కి మృత దేహాన్ని తరలించారు. ఈ విషయం పై సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ను వివరణ కోరగా శ్రీనివాస్ మృతికి సంబంధించి పలు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నామని అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.