UPDATED 2nd AUGUST 2022 TUESDAY 11:00 AM
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తన ట్విటర్ ఖాతాలో మద్యపాన నిషేధంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్టూన్ రూపంలో ప్రస్తావిస్తూ సెటైరికల్ గా విమర్శలు చేశారు. గత వారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్యం నిషేధంపై పలు వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని, దశలవారీగాగా మద్యం నిషేధం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం అని ఎక్కడా చెప్పలేదని, మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందని, చూసుకోవచ్చని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ లో విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు మధ్య నిషేధం పై ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కార్టూన్ రూపంలో పవన్ విమర్శలు చేశారు.
‘ వందల కోట్లు పోయాయని మేం ఏడుస్తుంటే మధ్యలో మద్య నిషేధం.. మధ్య నిషేధం అంటూ మీ గోలేందమ్మా’ అంటూ పవన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన కార్టూన్ లో రాసుకొచ్చారు. అంతేకాక కిందిభాగంలో యజమానులు సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్లు నష్టం అంటూ ప్రస్తావించాడు.