UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 06:30 PM
Nellore B Pharmacy Students : నెల్లూరులో సభ్య సమాజం తలదించుకొనే ఓ ఘటన చోటు చేసుకుంది. బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఓ ట్రాన్స్ జెండర్ విషయంలో దారుణంగా ప్రవర్తించారు. అతనికి ఆపరేషన్ చేసి ఏకంగా మర్మాంగాలు తొలగించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ సోదరి పోలీసులను ఆశ్రయించింది. బీ ఫార్మసీ స్టూడెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నెల్లూరు నగరంలో ఇద్దరు విద్యార్థులు బీ ఫార్మసీ చదువుతున్నారు. అదే నగరంలో శ్రీకాంత్ అనే ట్రాన్స్ జెండర్ నివాసం ఉంటున్నాడు. ఇతను గత కొంతకాలంగా హిజ్రాలతో స్నేహం చేస్తున్నాడు.బీ ఫార్మసీ విద్యార్థులకు ఎలా పరిచయం అయ్యాడో తెలియదు కానీ..ఇతడిని గాంధీబొమ్మ సెంటర్ లో లాడ్జికి రప్పించారు..
ఏకంగా ఆపరేషన్ చేసి శ్రీకాంత్ మర్మాంగాలు తొలగించారు. దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను చనిపోయాడు. ఈ విషయం శ్రీకాంత్ సోదరికి తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బీ ఫార్మసీ విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్ అలియాస్ అమూల్య స్వస్థలం ప్రకాశం జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు నిర్ధారించారు.