UPDATED 16th APRIL 2022 SATURDAY 07:00 AM
Shobhayatra: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భాగ్యనగరంలో శనివారం నిర్వహించే శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గౌలిగూడ రామ్మందిర్ నుండి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. 8వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు పాల్గోనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు గౌలిగౌడ రామ్మందిర్లో శోభాయాత్ర మొదలై వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ పాటు సాగి.. సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్ వద్ద రాత్రి 8గంటలకు యాత్ర ముగుస్తుంది.
మరో ఊరేగింపు రాచకొండ పరిధిలోని కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను పోలీసులు విడుదల చేశారు. హనుమాన్ శోభాయాత్ర శనివారం ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, కోఠి, తిలక్ రోడ్, సుల్తాన్ బజార్, రాంకోఠి, కాచిగూడ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ, చిక్కడపల్లి ఎక్స్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా అశోక్ నగర్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక వైపు నుంచి, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్పేట్, బైబుల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూం మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయం, రామ్ గోపాల్ పేట్ పీఎస్, ప్యారడైజ్ ఎక్స్ రోడ్, సీటీవో జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ నుంచి ఎడమ వైపు మీదుగా తాడ్బండ్లోని శ్రీహనుమాన్ ఆలయానికి శోభాయాత్ర చేరుకుంటుంది.
ఇదిలా ఉంటే కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి బయలుదేరి ర్యాలీ చంపాపేట్ ఎక్స్ రోడ్, ఐ ఎస్ ఐ సదన్, దోబిఘాట్, మలక్ పేట్ ఏసీపీ కార్యాలయం, సైబరాబాద్ కాలనీ రోడ్డు, సరూర్ నగర్ ట్యాంక్, కొత్తకోట, దిల్ సుఖ్ నగర్, మూసారాంబాగ్, నల్గొండ క్రాస్ రోడ్డు, చాదర్ ఘాట్ నుంచి కోఠి డీఎం అండ్ హెచ్ జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. యాత్ర జరిగే సమయంలో నగరంలోని 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మల్లింపులు ఉంటాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా 040 – 27852482, 90102 03626, లేదా హైదరాబాద్ పోలీసు సోషల్ మీడియా యాప్స్ను సంప్రదించవచ్చునని పోలీసులు తెలిపారు.