UPDATED 30th MAY 2022 MONDAY 05:20 PM
Chandrababu On Mahanadu : పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు సక్సెస్ అయిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఒంగోలు మహానాడు ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు. జగన్ అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు మహానాడుతో భరోసా వచ్చిందన్నారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రాజకీయాలకే అనర్హుడు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు చంద్రబాబు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో నెలకు రెండు జిల్లాలలో పర్యటనలు చేయాలన్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుపోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
క్విట్ జగన్- సేవ్ అంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. మహానాడు విజయంలో భాగస్వాములు అయిన నేతలకు చంద్రబాబు అభినందనలు. ప్రకాశం జిల్లా నేతల పని తీరుకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. మహానాడు సక్సెస్ ను పార్టీ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని చంద్రబాబుతో చెప్పారు నేతలు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని చంద్రబాబుతో అన్నారు.







