UPDATED 26th JULY 2022 TUESDAY 08:00 PM
Ration Rice Distribution : ఏపీలో నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పున:పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుండగా కేంద్ర ప్రభుత్వం 89 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని తెలిపారు.
కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వెనుకబడిన తొమ్మిది జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలకు రేషన్ బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసి వేస్తామని చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.







