UPDATED 28th MAY 2022 SATURDAY 07:30 PM
Tirumala Rush: తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులుతరలివస్తున్నారు. శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతుంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపారు.
వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో వేంకటేశ్వరుడి దర్శనానికి తరలివచ్చారు.దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు పలు సూచనలు చేసారు.
కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. అదే సమయంలో సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సైతం తమ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు పేర్కొన్నారు.