తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 10 జనవరి : కేరళలో భారీ సెక్స్ రాకెట్ బట్టబయలైంది. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి భాగస్వాములను మార్చుకుంటున్న వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టాయం జిల్లాలోని కరుకాచల్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో వ్యక్తితో లైంగిక చర్యలో పాల్గొనాలంటూ భర్త ఒత్తిడి తెస్తున్నాడంటూ సదరు మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్త సహా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపుల్లో వెయ్యికి పైగా జంటలు ఉన్నాయని.. వారు తమ భాగస్వాములను మార్పిడి చేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కేరళలోని మూడు జిల్లాలకు చెందినవారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు వ్యక్తులకు ఈ సెక్స్ రాకెట్ సంబంధాలున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులూ ఈ వ్యవహారంలో భాగమైనట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరో 25 మంది పరిశీలనలో ఉన్నారని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.







