UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 04:00 PM
NIA Searches : చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది. జిల్లాలోని మదనపల్లెలో ఆంజనేయులు అలియాస్ అంజి అనే వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసి ఎన్ఐఏ బృందం చెన్నైకి తీసుకెళ్ళింది.
సుమారు ఆరు గంటల పాటు ఆంజనేయులు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు.
ఆంజనేయులు అనే మాజీ నక్సలైట్ ఉద్యమంనుంచి బయటకు వచ్చి మదనపల్లిలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా… ఆంజనేయులు మావోయిస్టులకు రహస్యంగా సమాచారం చేరవేస్తూ, శిక్షణ ఇస్తున్నాడనే అనుమానంతో అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా బతుకుతున్న తమను వేధిస్తున్నారని ఆంజనేయులు భార్య సుగుణ వాపోయింది. తమకు నక్సలైట్లతో సంబంధం లేదని, తన భర్తను వెంటనే విడిచి పెట్టాలని సుగుణ ఎన్ఐఏ అధికారులను కోరింది.







