UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 01:10 PM
అమరావతి ( రెడ్ బీ న్యూస్): ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి టీమ్ భేటీపై.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు. చిరంజీవిపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. టాలీవుడ్ సమస్యలపై మొదటి నుంచి చిరంజీవి మాత్రమే మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం కూడా ఆయన ఒక్కరినే పిలిచి అన్ని విషయాలపై మంతనాలు చేసిందని.. టెన్ టీవీకి ఇచ్చిన ఫోన్ ఇన్ లో గుర్తు చేశారు. అయితే.. చిరుతో పాటు వెళ్లిన రాజమౌళి, ప్రభాస్, మహేష్ గురించి నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ ను కలిసేందుకు వెళ్లిన వాళ్లలో తాము చిరంజీవిని మాత్రమే నమ్ముతున్నట్టు నట్టి కుమార్ చెప్పారు. మిగిలిన వారంతా.. స్వార్థం కోసమే జగన్ దగ్గరికి వెళ్లారని అభిప్రాయపడ్డారు. రాజమౌళికి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ కు రాధేశ్యామ్, మహేష్ కు సర్కారు వారి పాట వంటి భారీ సినిమాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుకే.. వారిని కాకుండా తాను చిరంజీవిని మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే.. రాజమౌళి, ప్రభాస్, మహేష్ వంటి ప్రముఖులు జగన్ ను కలవడంలో ఏ మాత్రం తప్పు లేదని నట్టి కుమార్ అన్నారు. మరోవైపు.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరి కొన్ని సంస్థలు.. సమస్యల పరిష్కారంపై సరిగా స్పందించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. చిరంజీవి ముందు నిలబడి.. మొదటి నుంచీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. టాలీవుడ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







