రాయచోటి (రెడ్ బీ న్యూస్) 1డిసెంబర్ 2021: వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పంపిణీలో తమకు న్యాయం చేయాలంటూ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డికి ఫిర్యాదు చేసిన బాధితులపై వైకాపా కార్యకర్త దాడికి దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా! అంటూ ఆ కార్యకర్త వారిపై చేయి చేసుకొన్నారు. కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లి పంచాయతీ గరుగుపల్లెలో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు చెక్కులు పంపిణీ చేసేందుకు మంగళవారం చీఫ్ విప్ ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా పరిహారం పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని కొందరు బాధితులు ఆయనకు ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్ ఒక వర్గానికి మాత్రమే పరిహారం అందేలా చూశారన్నారు. న్యాయం జరిగేలా చూస్తానని చీఫ్ విప్ సమాధానం చెబుతుండగా... ఆయన సమక్షంలోనే ఓ వైకాపా కార్యకర్త వారిపై చేయి చేసుకొన్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో చీఫ్ విప్ గ్రామం నుంచి వెనుదిరిగారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. అధికార పార్టీ మద్దతుదారులకు ఇచ్చి మిగిలిన బాధితులకు ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ప్రశ్నించారని సర్పంచు వాసు తెలిపారు.







