UPDATED 30th JUNE 2022 THURSDAY 11:40 AM
N.Chandrababu Naidu: శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించడం తనను కలచివేసిందన్నారు. నిర్లక్ష్యం వల్ల ఐదుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటన విషయంలో ఉడుత పేరు చెప్పి, ప్రభుత్వం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండటంపై లోకేష్ మండి పడ్డారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ‘‘ప్రమాద ఘటనపై కనీస విచారణ చేపట్టకుండానే కట్టుకథలు అల్లుతున్నారు. కోతల్లేకుండా విద్యుత్ అందిస్తున్నందుకే ప్రమాదం జరిగిందని చెప్పలేకపోయారా? తేనెటీగల వల్ల నాడు రథం తగలబడితే… నేడు ఉడుత వల్ల కరెంటు వైరు తెగిపడిందా? కహానీలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటైపోయింది’’ అంటూ నారా లోకేష్ విమర్శించారు.







