Updated 3rd May 2023 Wednesday 6:15 pm
Chandrababu Naidu : వైసీపీ నేతలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), తాము కలిస్తే మీకేంటి నొప్పి? అంటూ ప్రశ్నించారు. రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ వస్తే వైసీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట, ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. సినిమా పరిశ్రమలో మొదటి ఇంటర్నేషనల్ మార్కెట్ ను చూపించిన వ్యక్తి రజనీకాంత్ (Rajinikanth).. అటువంటి వ్యక్తిని ఇష్టామొచ్చినట్లుగా నోటికి ఎంత వస్తే అంతగా దారుణంగా మాట్లాడటం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మేము ఎవరిని కలిస్తే మీకెందుకు? నేను ఎవరినైనా కలుస్తా.. మీకెందుకు అంత బాధ? నేను ఎవరిని కలిసినా.. నన్ను ఎవరు కలిసినా వైసీపీకి వణుకు పుట్టుకొస్తోంది ఎందుకంటే ఓటమి కళ్లముందు కనిపిస్తోంది. అందుకే ప్రస్టేషన్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓడిపోతామని వైసీపీ నేతలు (YCP Leaders) డిసైడ్ అయ్యారని, అందుకే విచక్షణ అనే మాటకు అర్థం కూడా తెలియకుండా మాట్లాడుతున్నార”ని మండిపడ్డారు చంద్రబాబు. ఒకసారి ఓడిపోతే దేశం వదిలిపోరిపోవాలని డిసైడ్ అయిపోయారు. మరి కొంతమంది ఇక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని పోటీ చేసినా పరువు పోగొట్టుకుని ఘోరంగా ఓడిపోతామని డిసైడ్ అయి ఇక ఎన్నికల్లో పోటీ చేయమని నిర్ణయించుకున్నారని అన్నారు. పొత్తులపై చంద్రబాబు స్పందిస్తూ.. “పొత్తులపై మీకెందుకు తొందర. 45 ఇయర్స్ ఇండస్ట్రీ.. నాకు నేర్పుతారా? ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు” అంటూ సమాధానం ఇచ్చారు.
కాగా.. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం జరిగింది. ఈ క్రమంలో ఏప్రిల్ 29న మరోసారి చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయ (AP Politics) సమీకరణలు అంత్యంత వేగంగా మారిపోతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన పవన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. పలు అంశాలపై చర్చించారు. నడ్డాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన రహిత ఏపీ తమ లక్ష్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని మరోసారి తేల్చి చెప్పారు పవన్. బీజేపీ పెద్దలతో పవన్ భేటీ విషయాల గురించి కూడా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వివరించినట్లు సమాచారం.
కాగా.. చంద్రబాబు ఇటీవల ఓ జాతీయ చానెల్ చర్చా వేదికలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. తమతో కలిసి బీజేపీని కూడా ప్రయాణించేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలనే భావన చంద్రబాబు, పవన్ లో కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.







