అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: జగనన్న విద్యాదీవెన పథకంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను గతంలో హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రైవేట్ యాజమాన్యాల తరఫున న్యాయవాదులు విజయ్, వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం రివ్యూ పిటిషన్ కొట్టేస్తూ తుది తీర్పు వెలువరించింది. విద్యాదీవెన పథకం కింద ఇచ్చే నగదును తల్లుల ఖాతాల్లో కాకుండా విద్యాసంస్థలకు జమ చేయాలని ఆదేశించింది.







