Crime News: వారి నుంచి ప్రాణహాని ఉంది.. కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు

కడప (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ అన్బు రాజన్‌ను కలిసి నాలుగు పేజీల లేఖను అందించారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు శివప్రకాశ్‌రెడ్డి అనే మరో వ్యక్తి పేరును ఫిర్యాదులో ప్రస్తావించారు. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీ అన్బు రాజన్‌ను కోరారు. కృష్ణారెడ్డి తనకు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ అన్బు రాజన్‌ సైతం ధ్రువీకరించారు. కృష్ణారెడ్డి గత 30 ఏళ్లుగా వివేకా ఇంట్లో పనిచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. వివేకా హత్య కేసు విషయంలో గత కొంత కాలంగా కొంత మంది వివేకా కుటుంబసభ్యులపై పలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. 20 రోజుల క్రితం అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన గంగాధర్‌ రెడ్డి, పులివెందులకు చెందిన భరత్‌కుమార్‌ ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివేకా కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. వివేకా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్న కృష్ణారెడ్డి ఏకంగా వివేకా కుమార్తె, ఆమె భర్తపై ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us