UPDATED 7th FEBRUARY 2022 MONDAY 07:20 PM
ముచ్చింతల్ (రెడ్ బీ న్యూస్): ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సీఎం జగన్.. ప్రవచన మండపానికి వచ్చారు. చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం నిర్వహించారు. ప్రవాస భారతీయ చిన్నారుల అవధానం సీఎం జగన్ వీక్షించారు.
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జగన్. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని బోధించారని అన్నారు. రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణగా నిలిచారని అన్నారు. అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ముచ్చింతల్లో భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కాగా, నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టు వస్త్రాల్లో ప్రధాని మోదీ సమతామూర్తి సహస్రాబ్ది సమారోహంలో పాల్గొన్నారు. రుత్వికులు ప్రధాని మోదీతో సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని ప్రధాని ధరించారు. యాగశాలలో మోదీ ప్రత్యేక పూజలు చేసి విష్వక్సేన ఇష్టి యాగంలో పాల్గొన్నారు. భగవద్ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ లోకానికి అర్పితం చేశారు.
శ్రీరామనగరంలో ప్రతిష్టించిన సమతామూర్తి మంగళ రూపం.. ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం. థాయ్ లాండ్లోని బుద్ధ విగ్రహం (301 అడుగులు) కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.
ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సకల జనులకు అందించిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవద్రామానులు. కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన 11వ శతాబ్దానికి చెందిన అధ్యాత్మిక వైష్ణవ యోగి శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహాన్ని శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలు జరుగుతున్నాయి.







