Updated 3rd January 2023 Tuesday 6:25 pm
Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి మూల విరాట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇన్ స్టాగ్రామ్ లోని కనకదుర్గ టెంపుల్ ఐడీతో వీడియోను పోస్ట్ చేశారు. ఆలయ సిబ్బంది సహకారంతోనే వీడియో తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మూలవిరాట్ ను వీడియో తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని ఈవో భ్రమరాంబ తెలిపారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
బెజవాడ దుర్గమ్మ ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అమ్మవారి మూలవిరాట్ను వీడియో తీయడం నిబంధనలకు విరుద్ధం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు. అంతేకాదు సోషల్ మీడియాలో పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో కనకదుర్గ టెంపుల్ ఐడీలో ఈ దృశ్యాలు కనిపించాయి.
ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు వెలుగు చూశాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం దుమారం రేపడంతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
అమ్మవారి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంపై భక్తులు ఫైర్ అవుతున్నారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడం ఏంటని మండిపడుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.







