Nadendla Manohar: సీఎంను నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం: నాదెండ్ల

UPDATED 12th JULY 2022 TUESDAY 12:10 PM

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రహదారుల విషయంలో గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్ (#GoodMorningCMSir)’ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. మంగళవారం తెనాలిలో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన చేపట్టబోయే కార్యక్రమం గురించి వివరించారు. ‘‘ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో బాగాలేని రోడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డిజిటల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామాలు, మండలాల రోడ్ల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లిస్తున్నారు.

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. సామాన్యుడి మీద భారం వేసి, పెట్రోల్ మీద ప్రతి ఏటా రూ.750 కోట్ల రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఆ సెస్ చూపి రూ.6 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ముఖ్యమంత్రికి జవాబుదారీ తనం ఉంటే, ఆ నిధులు దేనికోసం ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన తిప్పికొడుతుంది’’ అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us