రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. తన బ్యాటింగ్లో ఎలాంటి లోపం లేకపోయినా.. తరచూ ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతులను వేటాడి పెవిలియన్ చేరుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోహ్లీ ఈ బలహీనతను అధిగమించాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి సలహా తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సూచించాడు. ‘విరాట్ కోహ్లీ నూతన సంవత్సరం సందర్భంగా సచిన్ టెండూల్కర్కు శుభాకాంక్షలు తెలిపి.. ఓ సలహా అడిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. టీమ్ఇండియా 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో.. ఆఫ్సైడ్ బంతులను ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలి. మూడో టెస్టు మ్యాచ్లో క్యాచ్ ఔట్ అయ్యాక మళ్లీ అలాంటి షాట్లు ఆడబోనని సచిన్ చెప్పాడు. ఆ తర్వాత సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో ఆఫ్ సైడ్ బంతులను వదిలేసి ఆడాడు. కేవలం మిడ్ ఆఫ్, స్ట్రెయిట్, ఆన్సైడ్ మాత్రమే షాట్లు ఆడి తొలి ఇన్నింగ్స్లో 241 పరుగులు నాటౌట్, రెండో ఇన్నింగ్స్లో 60 నాటౌట్గా నిలిచాడు. కోహ్లీ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. ‘కోహ్లీ బ్యాటింగ్ తీరులో ఎలాంటి లోపాలు లేవు. కానీ, దురదృష్టవశాత్తు తరచూ ఆఫ్ స్టంప్ బంతులకే ఔటవుతున్నాడు. క్రికెట్లో ప్రతి ఆటగాడు తప్పులు చేస్తాడు. అయితే, క్యాచులు జారవిడవడం వల్ల కొందరూ బతికి పోతుంటారు. కోహ్లీకి ఆ అదృష్టం లేదు. కొత్త సంవత్సరంలో కోహ్లీ బలహీనతను అధిగమిస్తే మరిన్ని అద్భుత శతకాలు చూడొచ్చు’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆఫ్స్టంప్ బంతులకే వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.







