* ఫ్రీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
* నాయకత్వ లక్షణాలు బయటకు తీసేందుకే ఈ ఎన్నికల ప్రక్రియ
* అఖిలభారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఊట్ల వరప్రసాద్
* యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జి పెద్దిరెడ్డి ప్రదీప్
UPDATED 28th DECEMBER 2017 THURSDAY 6:00 PM
విజయవాడ : కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు నిర్వహించటానికి సన్నాహాల్లో భాగంగా మెంబర్షిప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడుస్థాయిల్లో కమిటీని ఎన్నుకోవటం జరుగుతుందని, ముందుగా యాక్టివ్ మెంబర్లను నమోదు చేసుకుంటారన్నారు. నమోదు అనంతరం మూడుస్థాయిల్లో ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందన్నారు. అసెంబ్లీ కమిటీ 15 మందితో ఎన్నిక ఉంటుందని, జిల్లాకమిటీ 16 మంది సభ్యులతో, రాష్ట్రస్థాయి కమిటీ 16 మంది సభ్యులతో ఉంటుందన్నారు. జిల్లా కమిటీ విషయానికొస్తే 12.5 శాతం ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సంస్థాగత ఎన్నికల్లో యాక్టివ్ మెంబర్షిప్ పొందటానికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు లోపు వారు అర్హులుగా పరిగణింపబడతారని, ఆన్లైన్ యాక్టివ్ మెంబర్షిప్ కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. యాక్టివ్ మెంబర్షిప్ రుసుము రూ.125 ఉంటుందని, ఇది ఓపెన్ మెంబర్షిప్ అని, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవచేయాలనే ఆలోచన ఉన్న యువత అందరికి యువజన కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఊట్ల వరప్రసాద్ తెలియచేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధనేకుల మురళీమోహన్, మాజీ ఎంఎల్ఏ మస్తాన్వలీల చేతుల మీదుగా ఊట్ల వరప్రసాద్ ఈ ప్రీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చేనెల ఐదవ తేదీన రాష్ట్రస్థాయి మెంబర్షిప్ కార్యక్రమం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, పిఆర్వో కునాల్, తుకారాం ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభం నుంచి 40 రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, రాహుల్గాంధీ యువతలో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటకు తీసేందుకు ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జి పెద్దిరెడ్డి ప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్తి కృష్ణమురళీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లూరి విజయకుమార్, జనరల్ సెక్రటరీ సుజాత, రామారావు, దారా ఫణీంద్ర, శీలం రామకృష్ణ, ముగతాటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.







