UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 8:40 PM
Botsa On Rushikonda : విశాఖ పరిధిలోని రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజుకుంది. వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలు తవ్వకాలతో రుషికొండను మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని వాపోతున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ సైతం.. రుషికొండకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పవన్ స్వయంగా పరిశీలించారు.
రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.
రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను జనసేనాని పవన్ పరిశీలించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. అసలు కొండపై ప్రభుత్వ నిర్మాణాలతో విపక్షాలకు వచ్చిన నష్టమేమిటని బొత్స ప్రశ్నించారు. గతంలోనూ రిషికొండపై నిర్మాణాలు ఉన్నాయి కదా అన్నారు. రిషికొండపై ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్న ఆయన.. రిషికొండపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. రిషికొండ నిర్మాణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న బొత్స.. వాటిని విపక్షాలకు కొమ్ము కాస్తున్న మీడియా భూతద్ధంలో చూపిస్తోందని విమర్శించారు.







