UPDATED 4th APRIL 2022 MONDAY 11:40 PM
MP Rammohan Naidu: ఏపీలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసిందని ఎంపీ రామ్మోహన్ అన్నారు. ఇప్పటికే విద్యుత్ కోతలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం కరెంటు బిల్లుల మోతమోగిస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా లక్కోవాలి అనే ఆలోచనతోనే పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్..అందుకనుగుణంగానే రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలు పెంచారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇంత భారీగా విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ రెడ్డి ప్రజలకు చేసే మేలు ఇదేనా అంటూ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
వెంటనే రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కరెంట్ ఛార్జీల రూపంలోనే ప్రజలపై రూ.42 వేల కోట్ల భారం మోపారని ఎంపీ రామ్మోహన్ విమర్శించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు సహా ఏఒక్కటీ సాధించలేని జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిలిందని ఎంపీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ వైసీపీ నేతలు నీర్యిర్యం చేశారన్న ఎంపీ రామ్మోహన్..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అందరం కలిసి రాజీనామాలు చేయాలనీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర సమస్యలను, అంశాలను టీడీపీ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభలో లేవనెత్తుతుంటే..అక్కడున్న వైసీపీ ఎంపీలు అసభ్య పదజాలం వాడుతూ అడ్డుతగులుతూ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.







