Updated 12th July 2023 Wednesday 5:20 pm
AP Cabinet Key Decisions : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపీబీ(SIPB) నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు చేశారు. అసైన్డ్ భూముల చట్టం 1977కి మార్పులు చేసే ప్రతిపాదనపై చర్చ జరిగింది.
భూమి లేని నిరు పేదలకు అసైన్డ్, లంక భూముల పంపిణీపై చర్చించారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలుపైనా సమాలోచనలు చేశారు. అమరావతిలో ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపైన విస్తృతంగా చర్చించారు. ఈ నెల 20న అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
3గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం సాగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్-5 జోన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షించారు. కోర్టు కేసుల నేపథ్యంలో త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించే విషయంపైన చర్చ జరిగింది. ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీకాకుళంలో ఉన్న భావనపాడు, మూలపేట పోర్టుకు సంబంధించిన నిర్మాణాల విషయంలో రూ.3వేల 880 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూములు, లంక భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి సంబంధించి 1500 మెగా వాట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. హడ్కో నుంచి రూ.750 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 454 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.







