Updated 8th August 2023 Tuesday 3:15 pm
CM Jagan flood Affect Areas : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. గతంలో వరద బాధితులను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఈ మేరకు మంగళవారం కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బాధితులకు అందుతున్న సాయాన్ని తానే అడిగి తెలుసుకుంటానని చెప్పారు.
కచ్చా ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే వారికి ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. దెబ్బతిన్న ప్రతి గుడిసెకు రూ.10 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పంట నష్టం వివరాల లిస్ట్ ఆర్బీకేల్లో ఉంటుందన్నారు. ఆగస్టు నెలాఖరులోగా పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.
నిన్న (సోమవారం) నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వరద బాధితులు తమ గోడును సీఎంకు చెప్పుకుంటున్నారు. దీంతో అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు.







