Updated 1st March 2023 Wednesday 2:10 pm
Sri Sri Swatmanandendra Saraswati: శారదా పీఠానికి ఓ రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం హిందు ధర్మంకోసం పనిచేస్తుందని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. హర్యానా కురుక్షేత్ర వేదికగా విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం విజయంవంతం అయిందని చెప్పారు. కురుక్షేత్రలో లక్ష చండీ మహా యజ్ఞం ఘనంగా జరిగిందని, కలియుగంలో ఇలాంటి యజ్ఞం జరగడం అరుదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పండితులు యజ్ఞంలో పాల్గొన్నారని, లక్ష చండి యజ్ఞం.. యజ్ఞ కుంభమేళా లాంటిదని అన్నారు.
శారదా పీఠం కార్యకలాపాలు ఢిల్లీలోనూ విస్తరిస్తామని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రభుత్వం సహకారం అందిస్తోందని భావిస్తున్నామని అన్నారు. శారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని స్పష్టం చేశారు. మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటు వైపు ఉంటుందని తెలిపారు. మా విధానం హిందు ధర్మాన్ని వ్యాప్తి చేయడమని, హిందు ధర్మంకోసం మేము పనిచేస్తున్నామని చెప్పారు. ఇతర మతాలు, ధార్మాల గురించి మాకు అనవసరమని, మేము మనుషులందరిని గౌరవిస్తాం, హిందు ధర్మాన్ని గౌరవిస్తామని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు.
భారత దేశం హిందు దేశంగా ఉండాలని మేము కోరుకుంటామని అన్నారు. అధికారం కోసం యాగాలు చేయరని, ఒక వ్యక్తికి అధికారం రావాలని యాగాలు చేయరని చెప్పారు. అటువంటి ఆలోచనలు చేయకండి, సమాజం కోసం శారదా పీఠం పనిచేస్తుందని శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.







