Updated 27th December 2022 Tuesday 6:10 pm
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు జగన్ ఢిల్లీలోని జన్ పథ్ చేరుకుంటారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురిని జగన్ కలుస్తారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీతో ఆయన సమావేశం అవుతారు.
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పెండింగ్ నిధులు మంజూరు చేయాలని జగన్ కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం కూడా ఢిల్లీలో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే.
జీ20 సదస్సును వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్ లో నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మోదీ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ జగన్ పాల్గొన్నారు. తన తాజా పర్యటనలో భాగంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల గురించి మోదీకి జగన్ వివరించనున్నారు. జగన్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.







