Updated 3rd April 2023 Monday 3:05 pm
YSJagan: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్ కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇవాళ ఆయన ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గాల ఇన్ఛార్జిలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. వచ్చే సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ను ఉద్ధృతం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్నమంచిని తీసుకెళ్లాలని అన్నారు. దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశామని తెలిపారు.
ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలని సూచించారు. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలని ఆదేశించారు. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలని చెప్పారు. సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. ఒకవైపున గడపగడపకూ వైఎస్సార్ పార్టీ కార్యక్రమం జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో తాను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు అని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పార్టీ నుంచి పోగొట్టుకోవాలని తాను అనుకోనని తెలిపారు. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనని చెప్పారు.







