Updated 24th July 2023 Monday 7:10 am
Krishnayapalem Jagananna Layout : ఏపీ సీఎం జగన్ పర్యటన సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్ లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ (సోమవారం) ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కృష్ణాయపాలెం లేఅవుట్ హౌసింగ్ కు చేరుకుంటారు. వన మహోత్సవం సందర్భంగా అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌజ్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెంకటపాలెంకు చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా సోమవారం 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇక మరోవైపు తాడేపల్లిలోని నివాసం నుండి రాజధాని ప్రాంతానికి కేవలం ఏడు కిలో మీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాప్టర్ వినియోగించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే రాజధాని కార్యక్రమంలో భారీ కార్యక్రమం జరుగుతుందని, ఒకేసారి 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి భారీగా లబ్ధిదారులు వస్తూ ఉండటంతో వారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వీవీఐపీ సెక్యూరిటీలో సీఎంకు రహదారిని క్లియర్ చేయడం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో హెలికాప్టర్ ద్వారా రాకపోకలకు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి పేదలు, లబ్ధిదారులను వైసీసీ నేతలు ఆహ్వానిస్తున్నారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. అమరావతిలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని, ఇందులో పేదలే గెలవాలన్నారు.







