Chandrababu Letter : వైసీపీ నేత ఆత్మహత్యపై చంద్రబాబు బహిరంగ లేఖ

UPDATED 8th APRIL 2022 FRIDAY 06:00 PM

TDP chief Chandrababu letter : చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేత ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కుప్పం వైసీపీ నేత పార్థసారథి ఆత్మహత్య బాధాకరం అన్నారు. వైసీపీ నేతల వేధింపులకు చివరకు వారి సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారని పేర్కొన్నారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.

సూసైడ్ సెల్ఫీ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులకి పదవులు అనే విష సంస్కృతి కుప్పంలోనూ తీసుకువచ్చారని వాపోయారు.కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

పార్థసారథి ఆత్మహత్య స్థానికంగా వైసీపీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతల తీరుతోనే పార్థసారథి మృతి చెందాడన్న చర్చ జోరుగా సాగుతుంది. గతంలో కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ గా పార్థసారధి పనిచేశాడు. కుప్పం మున్సిపాలిటీ కాక ముందు వార్డు సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు.

వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీలోనూ మరోసారి అవకాశం లేదని స్పష్టం కావడంతో పార్థసారథి తీవ్ర మనస్థాపానికి గురయ్యారని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారన్న వాదన వినిపించింది. పార్థసారథి ఆత్మహత్యపై పలు పుకార్లు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో పార్థసారథి ఆత్మహత్య వ్యవహారంపై సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. ఈ సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను పార్థసారథి వెల్లడించారు. కుప్పం గంగమ్మ ఆలయ చైర్మన్ గా రెండేళ్లు కొనసాగినప్పటికీ కరోనా కారణంగా జాతర చేయలేక పోయాయని, మరో నెలలో రానున్న జాతర జరిపించి పదవి నుంచి దిగిపోతానని వైసీపీ నేతలకు చెప్పినా నాకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

గంగమ్మ గుడి చైర్మన్ పదవి కోసం రూ.35లక్షలు ఖర్చు చేశానని, పదవి ఇచ్చినందుకు రూ. 15 లక్షలు ఖర్చు చేశానని, బోర్డు ఏర్పాటు కోసం రూ. 10లక్షలు, ఆలయంలో మరమ్మతుల కోసం మరో పది లక్షలు అప్పు చేసి డబ్బులు వెచ్చించానని పార్థసారథి తన సూసైడ్ వీడియోలో వెల్లడించాడు. ఇప్పటికీ తెచ్చిన డబ్బులకు వడ్డీ కడుతున్నానని అన్నారు. ఏడేళ్లుగా వైసీపీని నమ్ముకున్న నా వద్ద కూడా డబ్బులు తీసుకునే పదవి ఇచ్చారని, కొత్తగా పార్టీలోకి వస్తున్న నాయకుల వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకున్నారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా బయటకొచ్చిన పార్థసారథి సెల్ఫీ వీడియో స్థానిక వైసీపీలో కలకలం రేపుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us