UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 05:10 PM
హిందూపురం (రెడ్ బీ న్యూస్): ఏపీలో కొత్త జిల్లాల జగడం ముదురుతోంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో స్వయంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. హిందూపురం జిల్లా కోసం బాలయ్య ఉద్యమించనున్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురానికి బాలయ్య చేరుకున్నారు. రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు. హిందూపురం జిల్లా కోసం రేపు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేయనున్నారు.
హిందూపురం జిల్లా కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేస్తారు. భారీ ర్యాలీ, మౌనదీక్ష ద్వారా తమ ప్రాంత ప్రజల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నారు బాలయ్య. ర్యాలీ అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్న బాలకృష్ణ… కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు ప్రకటించకూడదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. పెనుకొండకు తరలించుకుపోయారని మండిపడుతున్నారు. కనీసం జిల్లా కేంద్రంగా అయినా హిందూపురంను ఉండనివ్వాలని కోరుతున్నారు.
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ నడుస్తోంది. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది.
పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యస్థీకరణ నిర్ణయాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలయ్య డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. హిందూపురం వ్యాపార, వాణిజ్య పరంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిదని అన్నారు. సత్యసాయి జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని బాలయ్య ఇదివరకే డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు, భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందని ఆయన అన్నారు. జిల్లాల ఏర్పాటులో రాజకీయం చేయొద్దని కోరారు.
”పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయి. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి వారి చిరకాల కోరిక అయిన హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి” అని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించారు బాలకృష్ణ.







