Updated 15th July 2023 Saturday 9:40 am
Amanchi Swamulu – JanaSena: ఆంధ్రప్రదేశ్లోని చీరాల (Chirala) మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ (Amanchi Krishna Mohan) సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమంచి స్వాములు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడకు దర్శి, చీరాల, గిద్దలూరు ప్రాంతాలనుంచి ఆమంచి స్వాములు అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు భారీగా తరలి వెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లో కాపు ఓటు బ్యాంకు బాగా ఉంది. చీరాలలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణ మోహన్ గెలిచారు.
ఆయన గెలుపులో ఆమంచి స్వాములు కీలక పాత్ర పోషించారు. గత 20 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు రాజకీయాల్లో తోడుగా నిలిచిన ఆమంచి స్వాములు ఇప్పుడు జనసేనలో చేరుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఒకే కుటుంబంగా, ఒకే పార్టీలో ఉన్న ఈ సోదరులు ఇకపై ఒకరు జనసేనలో, మరొకరు వైసీపీలో ఉండనున్నారు. చీరాలలో సరికొత్త రాజకీయానికి తెరలేపారు స్వాములు. వైసీపీ ఆమంచి కృష్ణ మోహన్ ను పర్చూరు ఇన్ఛార్జ్ గా నియమించిన విషయం తెలిసిందే.







