తిరుమల (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున; జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో ప్రకటించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులు టీటీడీ సూచించింది.







