UPDATED 9th APRIL 2022 SATURDAY 10:50 AM
#ByeByeYSJagan : అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ.. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు వరుసగా చేస్తున్న ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కరెంటు కోతలను ప్రస్తావిస్తున్నారు.
జగనన్న విసనకర్రల పథకం, 2024లో జగన్ కు ప్రజలు బైబై చెబుతారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, ఉద్యోగ నియామకాలు తదితర హామీలపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గురువారం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ (#ByeByeYSJagan) టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కొంతమంది మీమ్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు 33 వేల మంది ట్వీట్స్ చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం గమనార్హం. దీనిపై వైఎస్ జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అలా అవమానించడం భావ్యం కాదని వెల్లడించారు. వారు చేస్తున్న ట్వీట్స్ కు బదులు ఇస్తున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ ByeByeBabu అనే నినాదం తెగ వాడిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల బై బై బాబు అంటూ నినాదాలు చేసేవారు. అప్పట్లో ఈ ట్యాగ్ తెగ ట్రెండ్ అయ్యింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించింది. మూడేళ్ల తర్వాత అనే నినాదాన్ని మార్చి #ByeByeYSJagan అంటూ ట్విట్టర్ లో హోరెత్తిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తూ ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదేశాలు జారీ చేసింది. APSPDCL ఆదేశాలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు షాక్ తగిలింది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది.
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం.. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్నే వాడాల్సి ఉంటుంది. 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలి. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.







