అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుని పురస్కరించుకొని రాష్ట్రంలో ‘వన్ టైం సెటిల్మెంట్ స్కీం’ (ఓటీఎస్)ను అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ నుంచి రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా హక్కు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. హక్కు లేక రూ.15-20 లక్షల విలువైన ఇళ్లను 2-3 లక్షలకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఓటీఎస్ ద్వారా సీఎం తప్పిస్తున్నారని వెల్లడించారు. ఎంత రుణం ఉన్నా ఓటీఎస్ ద్వారా రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయిస్తోందని చెప్పారు. తద్వారా వారికి పూర్తి హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారని కొడాలి మండిపడ్డారు. పేదలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 లక్షల మంది పేదలకు లబ్ధి కలిగించే ఈ పథకం రేపు సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
పవన్ రాజకీయ అజ్ఞాని..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని కొడాలి నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమన్నారు. వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. మాకు పవన్ సలహాలు ఇవ్వడం ఏంటని ఆక్షేపించారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అని.. పవన్ కల్యాణ్ కాదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ వెళ్లి బీజేపీకి సలహాలు ఇచ్చుకోవాలని హితవు పలికారు.







