ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 28 ఆక్టోబర్ 2021: శ్రీవేంకటేశ్వరుడు సింహవాహనంపై వైభవంగా ఊరేగారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి యోగనారసింహ అలంకరణలో సింహవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి సంకేతం. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను సింహ సమానంతో ప్రయత్నిస్తానని వాహనం ద్వారా శ్రీవారు నిరూపించారు. మహా స్నపన, ప్రధానహోమాలు, తిరుప్పావడసేవ, దిగ్దేవతా బలిహరణ, మహాశాంతి హోమం, తదితర కార్యక్రమాలను పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో అర్చకస్వాములు రమణీయంగా జరిపించారు. స్వామివారికి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు, ఆర్జేసీ సురేష్బాబు పట్టువస్త్రాలు సమర్పించారు.







