UPDATED 22nd OCTOBER 2022 SATURDAY 10:00 PM
Srinivasamangapuram: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, అర్చన నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, గరుడాళ్వార్, విమాన గోపురానికి, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పించారు. తరువాత సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.







