హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: కొత్త ఏడాదిలో హైదరాబాద్ నగర వాసులను అలరించేందుకు 81వ నుమాయిష్ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిలభారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే ఈ వస్త్ర, వస్తు ప్రదర్శన కోసం జీహెచ్ఎంసీ, ఫైర్, పోలీసు, విద్యుత్ అన్ని శాఖల అనుమతులు తీసుకున్నట్టు సొసైటీ తెలిపింది. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తూ.. కొవిడ్ నేపథ్యంలో ఈసారి స్టాళ్ల సంఖ్యను 1600కు కుదించారు. పెరుగుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ భయాల నడుమ కొవిడ్ రక్షణ చర్యలను పకడ్బంధీగా అమలు చేసి నుమాయిష్ను విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభాశంకర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకశ్మీర్, పశ్చిమ్బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్లో దర్శనమివ్వనున్నాయి.







